జగన్‌ది కుట్రపూరిత దీక్ష | T-lawyers complain on YS Jaganmohan reddy's indefinite fast | Sakshi
Sakshi News home page

జగన్‌ది కుట్రపూరిత దీక్ష

Aug 27 2013 4:54 AM | Updated on Apr 7 2019 4:30 PM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర, కుతంత్రాలతో చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర, కుతంత్రాలతో చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు ఆరోపించారు. అందువల్ల జగన్‌ను వేరే ప్రాంత జైలుకు తరలించాల్సిందిగా జైళ్లశాఖ ఐజీ సునీల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయాన్ని అడ్డుకునేందుకు, హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేయడానికే జగన్ దీక్షకు దిగారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో ప్రకటించి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో జగన్ నిరాహార దీక్ష చేయడంవల్ల ఆయన ఆరోగ్యంపై అపోహలు తలెత్తే అవకాశం ఉంటుందని, దీంతో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు తరలివస్తారని అనుమానం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో అంతర్గతంగా ఇప్పటికే కొన్ని ఘర్షణలున్నాయని, జగన్ దీక్ష కారణంగా సమస్యలు మరింత జటిలం అవుతాయని చెప్పారు. జైళ్లశాఖ అధికారులు స్పందించకుంటే హైకోర్టు పిల్ వేస్తామన్నారు.
 
 మరో జైలుకు మార్చండి : తెలంగాణ అడ్వకేట్ జేఏసీ
 జగన్‌ను రాష్ట్రంలోని మరో జైలుకు మార్చాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు శ్రీరంగారావు, తిరుపతివర్మలు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement