కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కనిపించకపోవటంతో పార్లమెంట్ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని తనతో సహా సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
* నేడు ఐదుగురు ఎంపీలం స్పీకర్ను కలిసి ‘ఆమోదం’ కోరతాం: అనంత
* సీఎంతో భేటీ అనంతరం రాజీనామాలపై కొందరు ఎంపీల డైలమా!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కనిపించకపోవటంతో పార్లమెంట్ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని తనతో సహా సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు ఉండవల్లి అరుణ్కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఎ.సాయిప్రతాప్లు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలసి.. గతంలో తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేందుకు తన వంతు కషిచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు తొందరపడవద్దని సలహా ఇస్తున్నప్పటికీ ఎవరి ఒత్తిడికి లొంగరాదనే తాము ఐదుగురం నిర్ణయించుకున్నామని అనంత పేర్కొన్నారు. అయితే.. సోమవారం ఢిల్లీలోనే ఉన్న సీఎం పలువురు ఎంపీలతో మాట్లాడటం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ భేటీలో పాల్గొనటం, రాజీనామాలు వద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఈ ఐదుగురు ఎంపీల్లోనూ కొందరు డైలమాలో పడ్డట్లు చెప్తున్నారు. ఎంపీలతో సీఎం, బొత్స మంగళవారం మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.