ఓ ఇంట్లో పడుకుంటే.. మరో ఇల్లు దోచేశారు! | robbers entered the night | Sakshi
Sakshi News home page

ఓ ఇంట్లో పడుకుంటే.. మరో ఇల్లు దోచేశారు!

Aug 3 2015 1:44 AM | Updated on Aug 30 2018 5:27 PM

మండలంలోని కొత్తకుంకాం గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చొరబడి మూడున్నర తులాలు బంగారం అపహరించారు.

లావేరు: మండలంలోని కొత్తకుంకాం గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చొరబడి మూడున్నర తులాలు బంగారం అపహరించారు. బాధిత కుటుంబం తమకున్న మరో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం. బాధితుడు రాంబాబు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిడుగు రాంబాబుకు డాబా ఇంటితోపాటు పెంకిటిల్లు ఉంది. డాబా ఇంటిన కాస్త చక్కగా ఉంచుతూ.. ఎక్కువగా పెంకిటింట్లోనే వంటలు చేసుకుని రాత్రులు అక్కడే పడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రాంబాబు కుటుంబ సభ్యులు డాబా ఇంటికి తాళం వేసి తమ పెంకిటింట్లో పడుకున్నారు. సరిగ్గా ఈ పరిస్థితి దొంగలకు కలిసొచ్చింది.
 
  డాబా ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని నిర్ధారించుకున్న దుండగులు, ఇంటి తాళాలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇనుప బీరువాను విరగ్గొటి అందులో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆదివారం ఉదయం రాంబాబు కుటుంబ తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరగొట్టి ఉండటంతో విషయం అర్థమైంది. బీరువా విరగొట్టి అందులో ఉన్న బంగారం చోరీకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే లావేరు పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో ఇన్‌చార్జి ఎస్‌ఐ వినోద్‌బాబు, జేఆర్‌పురం సీఐ విజయకుమార్ ఆదివారం తమ సిబ్బందితో ఆదివారం ఆ ఇంటిని పరిశీలించారు. బాధితుడిని ప్రశినంచి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి గ్రామంలోను, ఇతర ప్రాంతాల్లోను తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement