ఎర్రచందనం మినీ లారీ పట్టివేత | REd scandal Mini Lorry seiz | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం మినీ లారీ పట్టివేత

May 14 2015 4:56 AM | Updated on Sep 26 2018 6:01 PM

జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

రూ. కోటి విలువైన 51 దుంగలు స్వాధీనం
ఫ్లయింగ్‌స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం దాడులు

 
కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా కడప ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున మిట్టపల్లె జోగులపల్లె సమీపంలో మినీ లారీలోకి ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేస్తుండగా అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. అటవీశాఖ అధికారుల రాకను గమనించిన కూలీలు పరారయ్యారు.

మినీ లారీ (కేఏ01 బి 2337)లో మొదట 51 ఎర్రచందనం దుంగలు వేసి, తర్వాత 50 పచ్చిమిరపకాయల మూటలు వేశారు. 20 మంది కూలీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ నాగరాజు మాట్లాడుతూ దుంగల విలువ సుమారు రూ. కోటి ఉంటుందన్నారు.

అలాగే వాహనం విలువ రూ. 5 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్‌ఓలు మహమ్మద్ హ యాత్, శ్రీరాములు, ఎఫ్‌ఎస్‌ఓలు ఓబులేశు, చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారన్నారు. అనంతరం లారీని, ఎర్రచందనం దుంగలను కడప డీఎఫ్‌ఓ మహమ్మద్ దివాన్ మైదిన్ పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement