‘ఆయన అనుభవం చంద్రబాబు భజన చేయటానికే!’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుభవం చంద్రబాబు భజన చేయటానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికే పరిమితం కావటం శోచనీయమని వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేఈ తన స్థాయి మరిచి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు చెప్పే ధైర్యం కేఈకి లేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రిగా ఉంటూ నాలుగున్నరేళ్లలో జిల్లా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు.
వైసీపీ నవరత్నాలను విమర్శిస్తున్న కేఈ! ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పాచిపోయిన లడ్డూలు రుచి చూడలేదా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోని చెరువులను నింపుకోలేని అసమర్థ ఉపముఖ్యమంత్రి అని విమర్శించారు. కుటుంబసభ్యుల రాజకీయ పదవుల కోసం ఆత్మవంచన చేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకునిపై అనవసర విమర్శలు చేయటం మానుకోవాలని హితవుపలికారు.