సరదా కోసం మొదలుపెట్టిన గోళీలాట ఓ బాలుడి నిండు ప్రాణాల్ని బలిగొంది. ఆటలో ఏర్పడ్డ వివాదం కాస్త పెద్ద కావడం...
తొట్టంబేడు : సరదా కోసం మొదలుపెట్టిన గోళీలాట ఓ బాలుడి నిండు ప్రాణాల్ని బలిగొంది. ఆటలో ఏర్పడ్డ వివాదం కాస్త పెద్ద కావడం..ఇద్దరు బాలురు పరస్పరం కొట్టుకోవడంతో గంగయ్య అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు..శ్రీకాళహస్తి మండలం, అక్కుర్తి గ్రామానికి చెందిన రేణుక, తిరుపాల్ కుమారుడు గంగయ్య(16) శ్రీకాళహస్తి పట్టణంలోని తన తాత రాజులయ్య ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాడు. గురువారం కాలనీలోని తోటి స్నేహితులతో కలిసి మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో గోళీలాట ఆడేందుకు ఉపక్రమించారు. గోళీలాటలో గంగయ్యకు మరో యువకుడికి మధ్య వివాదం ఏర్పడింది.
వివాదం పెద్దదికావడంతో ఇద్దరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ సమయంలో గంగయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగయ్య మృతికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు.