
‘రెడ్’ అలర్ట్
ఆపరేషన్ శేషాచలంలో భాగంగా జిల్లాలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శేషాచలం అడవుల్లో మంగళవారం
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
తమిళనాడు సరిహద్దుల్లోనూ నిఘా
ప్రత్యేక బలగాల ద్వారా కూంబింగ్
బస్సులు.. రైల్వేస్టేషన్లనో సోదాలు
చిత్తూరు (అర్బన్): ఆపరేషన్ శేషాచలంలో భాగంగా జిల్లాలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతిలోని పోలీసు అధికారులు, టాస్క్ఫోర్సు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎర్రచందనం నరకడానికి వచ్చిన కూలీలు, వారి వెనుక ఉన్న మేస్త్రీలు, స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లాలోని అంతరాష్ట్ర సరిహద్దులు, అంతర్ జిల్లాల చెక్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని రొంపిచెర్ల, భాకరాపేట, ఎర్రావారిపాలెం, కేవీ.పల్లె, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం, నగరి, సత్యవేడు, నాగలాపురం, వి.కోట, కుప్పం సమీప ప్రాంతాల్లోని సరిహద్దుల్లో టాస్క్ఫోర్సు, ఎస్టీఎఫ్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అప్రమత్తమైన అటవీ శాఖ
పోలీసులతో పాటు జిల్లాలోని తూర్పు, పశ్చిమ డివిజన్ల అటవీ శాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. శేషాచల అడవుల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతి చెందడంపైప్రభుత్వ చీఫ్ కన్జర్వేటర్ నుంచి అటవీ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. జిల్లాలోని తూర్పు అటవీ ప్రాంతంలో డీఎఫ్వోలు, రేంజర్లు అప్రమత్తంగా ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ఒక్కొక్కరుగా కాకుండా గ్రూపులుగా చేయాలని ఆదేశించారు. అటవీ శాఖకు సంబంధించిన ఆస్తులను భద్రపరచాలని, తమిళనాడు సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందిని ఆదేశించినట్లు చిత్తూరు తూర్పు డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
బస్సుల్లో..
మరోవైపు తమిళనాడు, కర్ణాటకు వెళ్లే బస్సుల్లో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. చిత్తూరు, గుడిపాల ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో సైతం బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానితులు, గొడ్డళ్లు, కత్తులతో సంచరించే కూలీలు ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు పోలీసులు సూచనలిచ్చారు.