మానవజీవన విధానం, విలువలతో కూడిన నాటకం సమాజానికి చక్కటి సందేశా న్ని అందిస్తుందని ప్రముఖ సాహితీవేత్త లు సర్వోత్తమరావు...
తిరుపతి కల్చరల్, న్యూస్లైన్: మానవజీవన విధానం, విలువలతో కూడిన నాటకం సమాజానికి చక్కటి సందేశా న్ని అందిస్తుందని ప్రముఖ సాహితీవేత్త లు సర్వోత్తమరావు, ఆకెళ్ల విభీషణశర్మ, ప్రముఖ రచయిత కోటాపురుషోత్తం తెలిపారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలకు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు భారతదేశమని, ఆ కళలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదేళ్లుగా బహు భాషా నాటకోత్సవాలను నిర్వహిస్తూ కనుమరుగవుతున్న నాటకాలను పరిరక్షించిడం అభినందనీయమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. మహతిలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఆధ్యాత్మిక నృత్య, నాటకాలను ప్రజలందరూ తిలకించాలని వారు కోరారు.
అనంతరం చిన్నారి శ్రీమేధ, సరయూ ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది. మహిషాసురమర్థిని నాటకరూపం ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన శరత్చంద్ర బృందం శివప్రసాద్, సురేష్, హిందుమతి మూషిక వాహన, అష్టపది, శంభోశంకర, వేంకటాచల నిలయం వంటి భరతనాట్య రూపకాలు మైమరపించా యి. చివరిగా వాణి త్రిష ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఈ కార్యక్రమంలో అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ కన్వీనర్ అభినయ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.