
సాక్షి, ఏలూరు : ఆంధ్రాకే కాదు దేశానికి కూడా పోలవరం అత్యంత కీలకమైన ప్రాజెక్టుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలవరం పనులు వేగంగా సాగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్ట్ ను అనుకున్న షెడ్యూల్లో పూర్తి చేయాలని, లేకపోతే ప్రాజెక్ట్ వ్యయం మరింత పెరిగిపోయే అవకాశముందన్నారు. పోలవరం పనులు పూర్తికావడానికి తమ తరపు సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఫాస్ట్ ట్రాక్ లో పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పోలవరం పూర్తికావాలని సీఎం కోరుతున్నారని తెలిపారు.