జాతీయస్థాయి యోగా పోటీలకు స్థానిక భక్తవత్సలనగర్లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
నెల్లూరు (బృందావనం), న్యూస్లైన్ : జాతీయస్థాయి యోగా పోటీలకు స్థానిక భక్తవత్సలనగర్లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం విద్యార్థులకు అభినందన సభ జరిగింది. పాఠశాల హెచ్ఎం విజయప్రకాష్రావు మాట్లాడుతూ ఈ నెల 5,6,7 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన 59వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య అంతర్ జిల్లాల యోగా చాంపియన్ షిప్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారన్నారు.
వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయిలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జనవరి 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొననున్నారన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్-14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం, బాలుర జట్టులో ద్వితీయ స్థానం, అండర్-17 బాలుర విభాగంలో తృతీయ స్థానం పొందడం హర్షణీయమన్నారు. యోగాసనం చాంపియన్షిప్, వ్యక్తిగత విభాగంలో అండర్-14 బాలుర జట్టులో ఎంవీ కార్తికేయన్, అండర్-17 బాలుర జట్టులో ఎంఎస్ వెంకటరమణ ప్రథమ స్థానంలో, అండర్-14 బాలికల జట్టులో ఎస్.పూర్ణమ్మ ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 4 బంగారు, 4 రజత, 2 కాంస్య పతకాలు సాధించి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని విజయప్రకాష్రావు ప్రశంసించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేరీవరం, అజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.