మెడికో బలవన్మరణం | narayan medical college hostel student death | Sakshi
Sakshi News home page

మెడికో బలవన్మరణం

Aug 4 2014 4:07 AM | Updated on Oct 20 2018 6:19 PM

ఓ వైద్య విద్యార్థిని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.

నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్‌లో ఘటన
నెల్లూరు రూరల్: ఓ వైద్య విద్యార్థిని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు..కర్నూలులోని అబ్దుల్‌ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న కొండవీటి అపార్టుమెంట్‌లో నివసిస్తున్న దాసరి భాస్కర్‌రెడ్డికి ఇద్దరు సంతానం. కుమార్తె నాగశ్రావణి(21) నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. మొదటి నుంచి చదువులో రాణించే నాగశ్రావణి సున్నిత మనస్కురాలు. కొంతకాలంగా ఆమె ముఖంపై మచ్చలతో బాధపడుతూ చికిత్స పొందుతోంది.

ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వస్తానని కుటుంబసభ్యులకు ఫోన్ చేసింది. ఒక్క రోజు సెలవుకు ఇంతదూరం ఎందుకు సోమవారం తానే వస్తానని తండ్రి సర్దిచెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన నాగశ్రావణి తన గదిలో రాత్రి చున్నీతో ఉరివేసుకుంది. రాత్రి 10.45 గంటలకు సహచర విద్యార్థిని తలుపుతట్టగా ఎంతకీ తెరవకపోవడంతో పక్క గదుల్లోని విద్యార్థినులు, వాచ్‌మన్‌తో కలిసి గడ్డపారతో తలుపు తెరిచి ఉరికి వేలాడుతున్న నాగశ్రావణిని హుటాహుటిన నారాయణ వైద్యశాలకు తీసుకెళ్లారు.

ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై గిరిబాబు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి నెల్లూరులోని పెద్దాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు, బంధువులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్దసంఖ్యలో పెద్దాసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సీఐ సుధాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement