‘ఎవరిని మోసం చేయటానికి ఈ గొప్పలు?’ | Mvs Nagireddy fires on ap govt | Sakshi
Sakshi News home page

‘ఎవరిని మోసం చేయటానికి ఈ గొప్పలు?’

Apr 27 2017 7:04 PM | Updated on Jul 25 2018 4:42 PM

ఏపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌నాగిరెడ్డి మండిపడ్డారు.

అవనిగడ్డ(కృష్ణా): ఏపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌నాగిరెడ్డి మండిపడ్డారు. ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగి 8.5 శాతం వృద్ధిరేటు సాధించామని కేంద్రం ప్రకటిస్తే,  రాష్ట్రంలో మాత్రం  14 శాతం వృద్ధిరేటు సాధించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని నాగిరెడ్డి విమర్శించారు. పదిలక్షల ఎకరాల్లో సాగు పడిపోయి, పప్పుధాన్యాల ఉత్పత్తి దారుణంగా తగ్గితే 14శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. అవనిగడ్డలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు నెలకొని ఉంటే 14 శాతం వృద్ధిరేటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం ఎవరిని మోసగించడానికని ప్రశ్నించారు.

మినుము పంట సాగుచేసిన నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీలలో ఒకటే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇన్సూరెన్స్‌ అనేది కంపెనీలు చెల్లించేవని, ఇన్‌పుట్‌ సబ్సిడీ అనేది రైతులు తీవ్రంగా నష్టపోయినపుడు తరువాత పంట వేసుకునేందుకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వం ఇచ్చే  సబ్సిడీ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించలేదన్నారు. తెలంగాణలో సాగును పెంచేందుకు, రైతులను  ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం రైతు నోట్లో మట్టికొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.

మిర్చి, పసుపుకు క్వింటాల్‌కు రూ.1,500 బోనస్‌ ధర చెల్లిస్తామని, ఇందుకోసం వీఆర్వోలతో ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. ఈ నిర్ణయం టీడీపీ వాళ్లకు లబ్ధిచేకూరేదిగాను, పెద్ద కుంభకోణానికి దారితీసే చర్యగా ఆయన అభివర్ణించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డులో చేపట్టే రైతు దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని రైతులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement