విమానానికి తప్పిన ప్రమాదం | Missed accident to Aircraft in Renigunta Airport | Sakshi
Sakshi News home page

విమానానికి తప్పిన ప్రమాదం

Jul 20 2020 5:59 AM | Updated on Jul 20 2020 5:59 AM

Missed accident to Aircraft in Renigunta Airport - Sakshi

విమానాశ్రయం రన్‌వేపై బోల్తా పడిన ఫైరింజన్‌

రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8.30 గంటలకు రన్‌వేపై వెళ్తున్న ఫైరింజన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇండిగో విమానం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌వే వైపు వచ్చింది. రన్‌వేపై జరిగిన విపత్తును గుర్తించిన పైలెట్‌ విమానాన్ని దించకుండా గగనతలంలో కాసేపు చక్కర్లు కొట్టారు. అటు నుంచి అటే టేకాఫ్‌ అయి విమానాన్ని బెంగళూరుకు తరలించారు. విమానంలో మొత్తం 48 మంది ప్రయాణికులున్నారు.

వీరిలో 33 మంది రేణిగుంటలో దిగాల్సి ఉండగా, 15 మంది బెంగళూరుకు చేరుకోవాలి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫైరింజన్‌ను పక్కకు తీసుకెళ్లారు. యథావిధిగా విమాన రాకపోకలు కొనసాగాయి. ఇక్కడ దిగాల్సిన 33 మంది ప్రయాణికులను మళ్లీ బెంగళూరు నుంచి విమానంలో మధ్యాహ్నం 12.45కు తీసుకొచ్చారు. విమానం రావడానికి కొన్ని నిమిషాల ముందు ఫైరింజన్‌ రన్‌వేపై తనిఖీలు చేయడం ఆనవాయితీ. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఫైరింజన్‌ బోల్తా పడినట్లు అధికారులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement