ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా
రంపచోడవరం :ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనమైత్రి, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గిరిజనులకు పోలీసులు దగ్గరయ్యారని పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి చింతూరు పోలీస్ స్టేషన్కు నిర్భయంగా వస్తున్నారని చెప్పారు.
ఎటపాక వైటీసీ కేంద్రంగా గిరిజన యువతకు పారా మెడికల్ కోర్సుల్లో శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీలలో మావోయిస్టులు ఆర్మీ మిలీషియూ సభ్యులతోనే మనుగడ సాగిస్తున్నారని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో మావోయిస్టు దళాల సంచారం ఉందని, వారి కదలికలపై గట్టి నిఘా ఉందని తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం ఆస్మీ పాల్గొన్నారు.