స్థానికత అంశంపై న్యాయపోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.
హైదరాబాద్: స్థానికత అంశంపై న్యాయపోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్ధానికతపై అఖిలపక్షం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపి మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్బాబు, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, శ్రీనివాసులు, బిజెపి విష్ణుకుమార్ రాజు, ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. స్థానికతను నిర్ణయించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఈ సమావేశం అభిప్రాయపడింది.
1956 కటాఫ్ విధించండం సమంజసం కాదని నేతలు అన్నారు. ఇది ఫీజురీయింబర్స్మెంట్ వరకే పరిమితం కాదని, భవిష్యత్తులో ఉద్యోగాలు, నివాసానికి కూడా వర్తింపచేసే దురాలోచన ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై 21న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రులు చెప్పారు. సుప్రీం కోర్టులో కూడా ఎంసెట్పై ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందని మంత్రులు తెలిపారు.
విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరిస్తామని వైఎస్ఆర్ సిపి నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాన్ని తమ పార్టీకి అందజేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తమ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ వైఖరి చెప్తామన్నారు. కేంద్రంపై ఒత్తిడికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.