అటవీ ప్రాంతంలో హత్య? | Killed in the wild? | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో హత్య?

Mar 26 2015 2:16 AM | Updated on Sep 26 2018 5:59 PM

బోగోలు మండలం కొండబిట్రగుంట సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరువగా ఉన్న సిరిగోల్డ్ లేఅవుట్‌లో గుర్తుతెలియని వ్యక్తి (30) హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

బిట్రగుంట : బోగోలు మండలం కొండబిట్రగుంట సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరువగా ఉన్న సిరిగోల్డ్ లేఅవుట్‌లో గుర్తుతెలియని వ్యక్తి (30) హత్యకు గురైనట్లు తెలుస్తోంది. బుధవారం అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు అటుగా వెళుతున్న స్థానిక గిరిజనులు లేఅవుట్ ప్రాంతంలోని ముళ్ల చె ట్లలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. రోడ్డుకు దూరంగా లేఅవుట్ చివరి ప్రాంతంలో రైల్వేట్రాక్‌కు సమీపంలో మృతదేహం పడి ఉంది.

విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, సంఘటన స్థలాన్ని బట్టి హత్యగా అనుమానిస్తున్నారు. మొహం కూడా గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌మీద పడేసే ఉద్దేశంతో చిల్లచెట్ల వరకు తీసుకువచ్చి, వీలు కుదరకపోవడంతో వదిలేసి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయమై ఎటువంటి సమాచారం అందలేదని బిట్రగుంట పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement