సాక్షి, అనంతపురం:
సుదీర్ఘ విరామం తరువాత బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగుతూ సమస్యలను పక్కదారి పట్టించారు. గడిచిన పదేళ్లలో చేసిన తప్పులంటూ గత ప్రభుత్వాన్ని నిందించమే ధ్యేయంగా సమావేశాన్ని కొనసాగించారు. జెడ్పీ చైర్మన్ చమన్సాబ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, పరిటాల సునీత, విప్ యామినీ బాల, ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్ బాషా, బీకే పార్థసారధి, వరదాపురం సూరి, ఈరన్న, జేసీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామి, గేయానంద్ హాజరయ్యారు. అజెండాలో కేవలం నాలుగు అంశాలపై చర్చించి సమావేశం ముగించడంతో మెజార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉపాధి కల్పన, యువజన సంక్షేమం, గృహ నిర్మాణం, నెడ్క్యాప్, పౌరసరఫరా లు, ఎపీఎ ంఐపీ, పశుసంవర్థకం, ఉద్యానవనం, తదితర ముఖ్యశాఖల అభివృద్ధి ఇత ర కార్యక్రమాలను సమావేశంలో పట్టించుకోలేదు. విద్యుత్ సరఫరా సరిగా లేక రైతాంగం తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటోంది. దీనిపై రైతులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరు వు పెట్టినా అధికారపక్షం సరైన సమాధానం చెప్పలేకపోయింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలపై ఎదురుదాడి
సెల్ప్ఫైనాన్స్ ప్రకారం రుణ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం కొత్తగా సర్కులర్ జారీ చేసిందని, ఈ మేరకు ఎకరాకు బ్యాంకర్ ఇచ్చేది రూ. 11 వేల రుణమైతే ఎన్ని ఎకరాలకు ఎంత రుణాన్ని మాఫీ చేస్తారన్న విషయాన్ని స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ రాప్తాడు జెట్పీటీసీ సభ్యుడు రవీంద్రనాథ్రెడ్డి కోరారు. దీనికి సమాధానం చెప్పాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు రవీంద్రనాథ్రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఆయన పలుమార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా బల ప్రదర్శనకు దిగారు.
హంద్రీనీవాకు సంబంధించి రూ. 170 కోట్లు విడుదల చేస్తే మొదటి దశ పనులు పూర్తి అయ్యేవని, తద్వారా శ్రీశైలం డ్యాం నుంచి 3,800 క్యూసెక్కుల నీటిని పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వం వంద కోట్లు మాత్రమే మంజూరు చేసిందని, ఈ నిధులు ఏ మూలకు సరిపోవని ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, వరదాపురం సూరి సరైన సమాధానమివ్వకుండా కాంగ్రెస్ హయంలో రూ. 5,200 కోట్లు ఖర్చు చేసింది వాస్తవమేనని, అందులో సగం దిగమింగింది నిజమేనని అడ్డుగోలుగా మాట్లాడారు. కదిరి ప్రాంతంలో ఏవీఆర్ హంద్రీ-నీవా కాలువ పనులు నిలిచిపోయాయని, అటవీ ప్రాంతాల్లో భూసేకరణకు అడ్డంకులు ఏర్పడడంతో పనులు సాగడం లేదని సభ దృష్టికి తీసుకురాగా, దానికి హంద్రీ-నీవా ఎస్ఈ సమాధానం చెప్పబోతుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలి విషయాన్ని పక్కదారి పట్టించారు. బంగారు తాకట్టు రుణాలు, ట్రాక్టర్ రుణాలు వెంటనే చెల్లించాలని పలు చోట్ల బ్యాంకర్లు వేలం నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ భాషా, జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చి దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.
స్పందించిన కలెక్టర్ రైతుల ఇబ్బందుల దృష్ట్యా వాటిని తాత్కలికంగా వాయిదా వేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం సభ్యులు పదేపదే అడ్డు తగులుతూ చర్చ సాగకుండా చేశారు. ఎమ్మెల్యేలు వెనకుండి ఈ వ్యవహారాన్ని నడిపించడాన్ని పలువురు తప్పుపట్టారు.