తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం | Intermediate examination starts in Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Feb 27 2019 9:35 AM | Updated on Feb 27 2019 1:06 PM

Intermediate examination starts in Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణలో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభమయ్యాయి. నేటినుంచి జరుగుతున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా హాల్‌లోకి రానిచ్చేది లేదని అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫస్టియర్‌, సెకండియర్ కలుపుకొని ఏపీలో 10లక్షల 17వేల 600 మంది పరీక్ష రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1430 పరీక్షా కేంద్రాలను ఏపీ ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. మొత్తం 113 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందిపెట్టే కాలేజీలపై ఓవైపు చర్యలు తీసుకుంటామంటూనే... తమ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్‌ సంతకం తప్పనిసరంటూ ఏపీ బోర్డు అధికారులు స్పష్టంచేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తే 8 పరీక్షల వరకూ డీబార్ చేస్తామని విద్యార్థులను హెచ్చరించారు.

ఇటు తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తమ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులు.. దానిపై ఎలాంటి సంతకం అవసరంలేదని విద్యార్థులకు తెలంగాణ బోర్డు అధికారులు భరోసా కల్పించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో వచ్చేనెల 16, ఏపీలో మార్చి 18తో పరీక్షలు ముగియనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement