మళ్లీ కలకలం | Insisted again | Sakshi
Sakshi News home page

మళ్లీ కలకలం

Oct 7 2015 12:00 AM | Updated on Aug 10 2018 8:16 PM

బాక్సైట్ భగభగలతో మన్యం వేడెక్కుతోంది. ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది.

బాక్సైట్ ఉద్యమం ఉధృతానికి  మావోయిస్టుల యత్నం
ముగ్గురు టీడీపీ నాయకుల కిడ్నాప్
నేడు చర్చలకు ప్రజాసంఘాలు
వరుస సంఘటనలలో  గిరిజనుల బెంబేలు

 
బాక్సైట్ భగభగలతో మన్యం వేడెక్కుతోంది. ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ  జీకే వీధి మండలానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు మంగళవారం కొత్తగూడ వద్ద కిడ్నాప్ చేశారు. దీంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారపార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వీరిని విడిపించడానికి ప్రజాసంఘాలు బుధవారం మావోయిస్టులతో చర్చలకు సిద్ధమవుతున్నాయి.
 
విశాఖపట్నం: బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ గిరిజన ఉద్యోగ సంఘాలతో మావోయిస్టులు ఇటీవల సమావేశమవుతున్నారు. దళసభ్యులు రాత్రిళ్లు గ్రామాల్లో తిరుగుతూ ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు వెదజల్లుతున్నారు. బ్యా నర్లు కడుతున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కిడ్నాప్‌నకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీకే వీధి మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి కమిటీ మండల అధ్యక్షుడు మండలం బాలయ్యలను మంగళవారం కిడ్నాప్ చేశారు. వీరంతా అధికారపార్టీకి చెందినవారే కావడం విశేషం.

లేఖల కలకలం..: మన్యంలో గాలికొండ ప్రాంతంలో కొంత, జల్లెల ప్రాంతంలో ఎక్కువగా బాక్సైట్ తవ్వకాలకు అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ మావోయిస్టు కమిటీలు లేఖలు విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీలో గ్రీన్‌హంట్ పేరుతో పోలీస్ కూంబింగ్‌ను నిలిపివేయాలని సీపీఐ(మావోయిస్టు) ఏవోబీ ప్రత్యేక జోనల్  కమిటీ విడుదల చేసిన లేఖలో డిమాండ్ చేసింది. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం విడుదల చేసిన లేఖలోనూ ప్రభుత్వంపైనా ,పోలీసులపైనా తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. బాక్సైట్ తవ్వకాలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా ఈనెల 7నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు.

ప్రాణాలు తీస్తున్న బాక్సైట్:బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించిన గిరిజన నేతలను మావోయిస్టులు మట్టుబెట్టిన సంఘటనలు ఎన్నో.. మూడేళ్ల కిందట జీకేవీధి మండలం ఏబులం గ్రామానికి చెందిన మండల ఉపాధ్యక్షుడు (సీపీఐ)సోమలింగం బాక్సైట్ ప్రాంతంలో మట్టి నమూనా సేకరించడంతో దళసభ్యులు అతని ఇంటిపై దాడిచేసి గ్రామంలోనే అతడ్ని హతమార్చారు. రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం చౌడుపల్లికి చెందిన (కాంగ్రెస్ పార్టీ) జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సోమలింగంను అతని ఇంటిలోనే కాల్చి చంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement