దీపావళి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాజభవన్కు రావాల్సిందిగా పౌరులను గవర్నర్ దంపతులు ఆహ్వానించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రాజభవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ దంపతులు అందుబాటులో ఉంటారు.
కేసీఆర్ శుభాకాంక్షలు
దీపావళి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. కారుచీకట్లను తరిమికొట్టి వెలుగులు నింపే దీపావళి లాగానే తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారికి దీపావళి శుభాలను తీసుకురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తెలుగువారి జీవితాల్లో కాంతులు నింపాలి
వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు..
పండుగ వ్యయంలో కొంత తుపాను బాధితులకు కేటాయించాలని వినతి
వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో కాంతులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన బుధవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దివ్వెల వెలుగుల్లో జరగాలని, అదే సమయంలో.. హుదూద్ తుపాను వల్ల తీవ్ర నష్టానికి గురైన ఉత్తరాంధ్రకు సాయం అందించటానికి పండుగకు చేసే వ్యయంలో కొంత భాగాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి శుభాకాంక్షలు: కేవీ రమణాచారి
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, తెలంగాణతోపాటు యావత్తు తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.