దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. కిందిస్థాయి నుంచి ఆర్డీవో స్థాయి వరకూ రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లను తీర్చాలని మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సోమవారం రాష్ట్ర భూపరిపాలన కార్యాలయంలో జరిగిన సమీక్షలో పలు అంశాలపై మంత్రి, ఉన్నతాధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భక్తవత్సలనాయుడు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు గోపాల్రావు తదితరులతో కలిసి వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వీఆర్వోల వేతనం పెంచేందుకు అంగీకరించి ఫైలును ఇప్పటికే ఆర్థికశాఖకు పంపించారు. వీఆర్ఓలకు డీఏను రూ. వంద నుంచి రూ. 150కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయినవారి వారసులను కారుణ్య నియామకం కింద వీఆర్ఓగా నియమించేందుకు విద్యార్హతను పదో తరగతి కాకుండా ఏడో తరగతికి తగ్గించడంపైనా సానుకూలత తెలిపారు. వీఆర్ఓ పోస్టుల భర్తీలో వీఆర్ఏలకు ప్రస్తుతమున్న 30 శాతం కోటాను 50 శాతానికి పెంచేందుకు, వీఆర్ఏలకు చైన్మెన్గా పదోన్నతి కల్పించేందుకు, మహిళా వీఆర్ఏలకు 120 రోజుల మెటర్నిటీ లీవు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాల్ని సీజ్ చేసి కోర్టులో సమర్పించే బాధ్యత నుంచి రెవెన్యూ అధికారులను తప్పించాలన్న డిమాండ్కూ సానుకూలత తెలిపారు. ఇత ర శాఖల్లోలాగే 45 ఏళ్లు నిండినవారికి పరీ క్షలో అర్హతతో నిమిత్తం లేకుండా పదోన్నతి కల్పిం చేందుకు ఒప్పుకున్నా రు’’ అని వివరించారు.