ఈ భూమాయకు ఫ్లాట్ అవ్వాల్సిందే | government land buy and creats fake chalana | Sakshi
Sakshi News home page

ఈ భూమాయకు ఫ్లాట్ అవ్వాల్సిందే

Nov 16 2017 8:20 AM | Updated on Jul 26 2018 1:37 PM

government land buy and creats fake chalana - Sakshi

అధికార పక్ష నాయకుడొకరు ప్రభుత్వ భూమిని కాజేశారు. నిబంధనలు పక్కన బెట్టి     అధికారులూ సహకరించారు. విలువైన భూమి సదరు నాయకుడికిప్పుడు కాసులు కురిపిస్తోంది. మండల కేంద్రానికి సమీప భూమి సర్కారు విక్రయించకూడదు. ఈ నిబంధన ఉల్లంగించడమే కాదు.. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోడానికి వడివడిగా   పచ్చ జెండా ఊపేయడం అక్రమ భూ బాగోతానికి దర్పణం పడుతోంది.

చిత్తూరు, సాక్షి:   శ్రీరంగరాజపురం మండలంలో విస్తుగొలిపే భూ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వ్యవసాయానికి అనుకూలమైన భూమిని గుర్తించడం.. ప్రభుత్వ ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు.. నకిలీ ఛలానాలు సమర్పించడం.. వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు వేసి అమ్ముకోవడం.. ఇదీ దోపిడీ వరస. దీనికి సూత్రధారి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు భాస్కర్‌ నాయుడు. ఎస్సార్‌ పురం గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో 28వ సర్వే నెంబర్‌  17.36లో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.  మండల కేంద్రంలోని విలువైన భూమి  కావాలంటూ 2010లో భాస్కర్‌ నాయుడు మరో నలుగురు కలిసి     దరఖాస్తు చేసుకున్నారు.  2013లో రూ.17.36 లక్షలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో భాస్కర్‌ నాయుడు మిగతా ముగ్గురినీ కాదని భార్య, అక్క కుమారుడి పేరిట రిజిస్టర్‌ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధం..
మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి ఉంటే ప్రై వేటు వ్యక్తులకు ఇవ్వకూడదని 2007లో  రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. భాస్కర్‌ నాయుడుకు కట్టబెట్టిన భూమి మండల కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉంది. అప్పటి కలెక్టర్లు వీ. శేషాద్రి, సాల్మాన్‌ ఆరోఖ్యరాజ్‌ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. రాంగోపాల్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో వీరికి భూమి కట్టబెట్టారు. 2014లో టీడీపీ అధికార పీఠం ఎక్కడంతో చాలా సులువుగా వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తప్పుడు ఛలానా నెంబరు
తప్పుడు ఛలానాలతో..

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి రూ.2,42,750 లక్షలు 2014 డిసెంబర్‌లో ప్రభుత్వ ఖజనాకు జమ చేశామని చెప్పడంతో అప్పటి ఆర్డీవో పెంచల కిశోర్‌ భూ మార్పిడికి అనుమతి ఇచ్చారు.  వాస్తవానికి ఈ సొమ్ము చెల్లించలేదని సాక్షి పరిశీలనలో బయటపడింది. భాస్కర్‌ నాయుడు చెల్లించినట్లు చెబుతున్న ఛలానా నెంబరు 2014 జూలై 23వ తేదీది. ఆర్డీఓ ఉత్తర్వులో 2014 డిసెంబర్‌ 26న చెల్లించినట్లు చెప్పుకున్నారు. ఆ ఛలానా నెంబరుపై రూ.2 లక్షలు వేరే వ్యక్తి చెల్లించనట్టుగా ఖజానా శాఖ పరిశీలనలో తెలిసింది. వ్యవసాయేతర భూమిగా మార్పి డికి సీసీఎల్‌ఏ అనుమతి కావాలని నిబంధన ఉంది. దీన్ని తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు. 2015లో 28–2ఏ,3ఏ సర్వే నెంబర్లలోని 8.71 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకున్నారు.

ప్లాట్లు వేశారు.. కోట్లు కొల్లగొట్టారు..
చిత్తూరుకు ఎస్సార్‌ పురం సమీపంలో ఉండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయేతర భూమిగా అనుమతి వచ్చిన తరువాత 8.71 ఎకరాల ను 200 ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. గజం రూ.4500 నుంచి రూ.4700 వరకు అమ్ముకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోం ది. ఇందులో అడుగడుగునా అధికారుల ప్ర మేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నా యి. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను అమ్మకూడదని నిబంధనలున్నా దీన్ని బేఖాతరు చేస్తూ భూములు కట్టబెట్టడంలో అధికారులే కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే సీసీఎల్‌ఏ అనుమతి ఉండాలి.  అదేంలేకుండా  అనుమతులు మంజూరు చేశారు.

నిబంధనలను అతిక్రమించలేదు..
నిబంధనలు అతిక్రమించలేదు. రూల్స్‌ ప్రకారమే భూమిని తీసుకున్నాను. డబ్బు కట్టలేదనడం అబద్ధం. ఛలానా తీసుకున్న తరువాతే భూమార్పిడి చేశారు. ఛలానా నెంబరు తప్పుకాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. – భాస్కర్‌ నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్సార్‌పురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement