ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు | GHMC Official to give Notice N Convention Center Owners | Sakshi
Sakshi News home page

ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు

Sep 13 2014 3:08 AM | Updated on Jul 21 2019 4:48 PM

ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు - Sakshi

ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎంతమేర ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్నది నిర్ధారించేందుకు మరోమారు తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించనున్నారు.

హైదరాబాద్: పముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎంతమేర ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్నది నిర్ధారించేందుకు మరోమారు తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించనున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ నిర్మాణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొనడం తెలిసిందే. సెంటర్ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడం... జీహెచ్‌ఎంసీ నిబంధనలు, చట్టం మేరకు అధికారులు చర్యలు తీసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్వొకేట్ జనరల్(ఏజీ) సలహా కోరారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని దాని యాజమాన్యం వాదిస్తున్నందున వారి సమక్షంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరోమారు సర్వే చేయించి ఎఫ్‌టీఎల్ నిర్ధారించాల్సిందిగా ఏజీ సూచించారు. ఆ మేరకు చర్యలకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకనుగుణంగా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి నోటీసులిచ్చి... వారి సమక్షంలో ఎఫ్‌టీఎల్ నిర్ధారించనున్నారు. అనంతరం అంశాల వారీగా ఉల్లంఘనలను తెలియజేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు తిరిగి సర్వే కోసం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు లేఖలు రాస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement