డబ్బాంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా?: వైఎస్‌ జగన్‌

First SLBC Meeting Chaired By CM YS Jagan - Sakshi

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా

2019-20 రుణ ప్రణాళికను ఆవిష్కరణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ  రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేసిశారు. ఎస్‌ఎస్‌బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు ఎందుకు చూపిస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు ఏంటనీ? ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీ షెడ్యూల్‌ చేయడంవల్ల పెరుగుతున్నాయా? అని ఆరా తీశారు. అయితే కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడంవల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు సీఎం ముందు అంగీకరించారు. దీని వల్ల రైతులు లేదా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు వారు ఆర్థికంగా బలపడ్డారని కాకుండా మరింత అప్పులుపాలయ్యారని ఈ లెక్కలు చూపిస్తున్నాయని ఈ సమావేశంలో తేలింది.

మహిళలను వేధింపులకు గురి చేయొద్దు..
గత ప్రభుత్వం సున్నా వడ్డీకోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా? అని సీఎం ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన  రాష్ట్ర సచివాలయంలో 207వ  రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో ఆయన ప్రస్తుత పరిస్థితిపై సుధీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు సున్నావడ్డీ లభించకపోవడం వల్ల రుణమాఫీ 87,612 కోట్లు చేస్తానని చివరికి రూ.15వేల కోట్లు కూడా చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూశానని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ఏటా రైతులు రూ.87,612 కోట్ల మీద రూ.7–8వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయకపోవడం వల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందన్న విషయాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో రైతులు రుణభారంతో దెబ్బతిని ఉన్నారని, ఇప్పుడు బ్యాంకర్లు రైతులను డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు.

ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500
రైతుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే, రైతులు నిలదొక్కుకునేలా చూసేందుకే నవరత్నాలను అమలు చేయబోతున్నామని సీఎం స్పష్టంచేశారు. ఈ ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నామని సీఎం బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో రైతుల వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, కాబట్టే రైతులందరికీ అయ్యే పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేయబోతున్నామని చెప్పారు. కాబట్టే రైతులకు ఇవ్వబోతున్న ఈ సొమ్మును వారికి ఇంతకుముందు ఉన్న అప్పులకు జయచేసే వీలే ఉండకూడదని ముఖ్మమంత్రి బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు.

రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయస్థాయిలో నిరక్షరాస్యత 26శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారని, ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే అమ్మ ఒడిగా కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నామని, అలాగే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనకబాటును దృష్టిలో ఉంచుకునే వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని, నవరత్నాల్లోని ఈ పథకాలు అన్నింటి ద్వారా తాము అదించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ పాల్గొన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top