అమ్మా నువ్వు లేక.. నేను లేనమ్మా! | Family disputes With married women,two years son Died | Sakshi
Sakshi News home page

అమ్మా నువ్వు లేక.. నేను లేనమ్మా!

Jun 6 2015 6:17 AM | Updated on Sep 28 2018 3:39 PM

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - Sakshi

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందగా, మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి చెందిన

అమ్మా.. నవమాసాలు మోశావు..  కంటికి రెప్పలా పెంచావు.. చిరుప్రాయంలోనే తల్లిలేనివాడ్ని చేయాలనుకున్నావు.. నిను వీడి ఎలా బతికేదమ్మా.. అమ్మా.. నీ పొత్తిళ్లలో పెరిగేటోడ్ని.. నీ చేతి గోరు ముద్దలు తినేటోడ్ని.. నీవు లేకుండా ఎలా ఉంటాననుకున్నావు.. అమ్మా.. నాపై ఎన్నో ఆశలు పెంచుకున్నావు.. నాన్నపై భారం వేయాలనుకున్నావు.. కానీ నీ పేగు తెంచుకుని పుట్టానే.. కడదాకా నీవెంటే ఉంటా నమ్మా.. అంటూ..మంటల్లో కాలిపోతున్న తల్లి వద్దకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు ఓ చిన్నారి.

ఆపై తల్లీబిడ్డ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన శుక్రవారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.

 
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి

శ్రీకాళహస్తి రూరల్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందగా, మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి చెందిన, సంఘటన శుక్రవారం మండలంలోని ఊరందూరు గ్రామంలో జరిగింది.  గ్రామస్తుల కథనం మేరకు,  ఊరందూరు గ్రామానికి చెందిన శేషయ్య కుమారుడు శంకర్(28)కు అదే గ్రామానికి చెందిన ఆర్ముగం కుమార్తె అల్లీరాణి(24)తో మూడేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు హర్ష ఉన్నాడు. శంకర్ మండలంలోని ఓ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడేళ్లపాటు ఆనందంగా సాగిన వీరి కాపురంలో వారం రోజులుగా విభేదాలు తలెత్తాయి.

ఈ క్రమంలో శంకర్ కర్మాగారంలో విధులకు వెళ్లగా, శంకర్ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లీరాణి వంటింట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆమెను రక్షించేలోపు మృతి చెందింది. కాగా అల్లీరాణి మంటల్లో కాలిపోతున్న సమయంలో తల్లికోసం వెళ్లిన కుమారుడు హర్ష(02) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు హర్షను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ హర్ష  మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లీరాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement