కట్టకుంటే కరెంట్ కట్ | customer charges will if we not pay the bill | Sakshi
Sakshi News home page

కట్టకుంటే కరెంట్ కట్

Dec 25 2013 3:32 AM | Updated on Oct 1 2018 2:44 PM

వ్యవసాయానికి ఉచితంగానే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా రైతుల నుంచి కస్టమర్ చార్జీలను వసూలు చేయడం కొనసాగుతోంది.

 ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగానే కరెంటు ఇస్తున్నా, రైతుల నుంచి కస్టమర్ చార్జీలను వసూలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుండడంతో ఈ ఏడాదికి సంబంధించిన కస్టమర్‌చార్జీల బకాయిలను వందశాతం వసూలు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. దీంతో చార్జీలను చెల్లించని రైతులకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ సిబ్బంది  హెచ్చరిస్తున్నారు.
 
 మోర్తాడ్, న్యూస్‌లైన్ :
 వ్యవసాయానికి ఉచితంగానే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా రైతుల నుంచి కస్టమర్ చార్జీలను వసూలు చేయడం కొనసాగుతోంది. వారం రోజుల్లో 2013 సంవత్సరం ముగిసిపోతుండటంతో ఈఏడాదికి సంబంధించిన కస్టమర్ చార్జీలను వంద శాతం వసూలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కొత్త ఏడాది ఆరంభానికి గడువు సమీపిస్తుండటంతో పాత సంవత్సరానికి సంబంధించిన కస్టమర్ చార్జీలను వసూ లు చేయడానికి క్షేత్ర స్థాయి ఉద్యోగులు రం గంలోకి దిగారు.  చార్జీలను చెల్లించని రైతుల కు కరెంటు సరఫరా నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వినియోగించుకుంటున్న ప్రతి రైతు నుంచి కస్టమర్‌చార్జీలను వసూలు చేసి సంస్థ ఆదాయాన్ని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌పై నెలకు 30 చొప్పున ఏడాదికి 360 వసూలు చేస్తున్నారు. సాధారణంగా జనవరి నుంచి జూన్ నెల వరకు *180, జూలై నుంచి డిసెంబర్ వరకు మరో 180 వసూలు చేయాల్సి ఉంది. కాగా ఖరీఫ్ సీజను ముగిసిన తరువాతనే రైతుల చేతిలో డబ్బు ఉంటుంది. దీంతో ఆరు నెలలకు ఒకసారి కాకుండా ఏడాదికి సంబంధించిన కస్టమర్ చార్జీలను ఒకే సారి వసూలు చేస్తున్నారు.
 
 3 కోట్ల వరకు బకాయిలు
 జిల్లాలోని 36 మండలాల్లో 2,05,079 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. ఒక్కో కనెక్షన్‌కు 360 చొప్పున జిల్లాలో వసూలు లక్ష్యం 7,38,28,440గా నిర్ణయించారు. గతేడాదికి సంబంధించిన బకాయిలు *3 కోట్ల వరకు ఉన్నాయి. గడచిన సంవత్సరంలో వర్షాలు సరిగా కురవక పోవడంతో రైతులు అనుకున్నంతగా పంటలను సాగు చేయలేక పోయారు. దీంతో కస్టమర్ చార్జీలను రైతులు చెల్లించక పోవడంతో ఎన్‌పీడీసీఎల్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ సంవత్సరం ఆశించినదానికంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో  రైతులు సమృద్ధిగా పంటలను పండించారు. రైతుల నుంచి ఎలాగైనా కొత్త చార్జీలతో పాటు పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులు గట్టిగా చెబుతున్నారు.
 
 కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరికలు
 ఏడీఈ, ఏఏఈ, సబ్‌ఇంజినీర్, లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్, హెల్పర్ స్థాయి ఉద్యోగులు తెల్లవారు నుంచి గ్రామాల్లో తిరుగుతూ కస్టమర్ చార్జీల వసూలుకు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ చార్జీలు చెల్లించకుంటే ట్రాన్స్‌ఫార్మర్‌ల ఫీజులను తొల గిస్తున్నారు. అంతేగాక రైతుల ఇళ్ల విద్యుత్ కనెక్షన్‌లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. వందశాతం వసూలు లక్ష్యంగా ఉద్యోగులు పని చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా కస్టమర్ చార్జీలను వసూలు చేయని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండటం అటు రైతులు సహకరించక పోవడంతో ఇరువురి మధ్య తాము ఇబ్బందులు పడుతున్నామని క్షేత్ర స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement