తెలుగుదేశంలో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై చర్యలకు కాంగ్రెస్ రంగం సిద్ధంచేస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారితోపాటు పార్టీకి అనుబంధంగా కొనసాగి పార్టీ మారిన ఎమ్మెల్సీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
జంప్ జిలానీలపై చర్యలకు కాంగ్రెస్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంలో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై చర్యలకు కాంగ్రెస్ రంగం సిద్ధంచేస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారితోపాటు పార్టీకి అనుబంధంగా కొనసాగి పార్టీ మారిన ఎమ్మెల్సీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్కు చేరుకున్న అనంతరం ఈ నోటీసులు ఇవ్వనున్నారు. షోకాజ్ నోటీసులకు ఆయా ఎమ్మెల్సీలు వారం రోజుల్లో సమాధానమివ్వాలని కోరనున్నారు.
ఎమ్మెల్సీల సమాధానాలు అందిన తదుపరి పార్టీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం ద్వారా ఆ ఎమ్మెల్సీలపై అనర్హత చర్యలకోసం ఛైర్మన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఛైర్మన్కు సమర్పించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో ఏడుగురు ఎమ్మెల్సీలు అంగూరి లక్ష్మీ శివకుమారి, బలశాలి ఇందిర, షేక్ హుస్సేన్, కలిదిండి రవి కిరణ్వర్మ, కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), గాదె శ్రీనివాసులునాయుడు, బచ్చల పుల్లయ్యలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.