సీబీఐ సైతం రాజకీయ చట్రంలో బందీనే | Confessions of a top cop book released | Sakshi
Sakshi News home page

సీబీఐ సైతం రాజకీయ చట్రంలో బందీనే

Mar 20 2014 2:23 AM | Updated on Sep 2 2017 4:55 AM

సీబీఐ సైతం రాజకీయ చట్రంలో బందీనే

సీబీఐ సైతం రాజకీయ చట్రంలో బందీనే

సీబీఐ కూడా రాజకీయ చట్రంలో బందీయే. అందువల్లే కొన్ని కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది

సాక్షి, హైదరాబాద్: ‘సీబీఐ కూడా రాజకీయ చట్రంలో బందీయే. అందువల్లే కొన్ని కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. మరికొన్ని కేసుల్లో దర్యాప్తు ఏ స్థితిలో ఉందో కూడా పట్టించుకోదు’’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర పోలీసు శాఖ సమన్వయ విభాగం అదనపు డీజీ వినయ్ కుమార్ సింగ్ (వీకే సింగ్) చెప్పారు. పోలీసు, న్యాయ వ్యవస్థల్ని ప్రశ్నిస్తూ ఆయన రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్?.. కన్ఫెషన్స్ ఆఫ్ ఏ టాప్ కాప్’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీకే సింగ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలన్నీ తన పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. వాటిలో కొన్ని ఆయన మాటల్లోనే..
 
  బీహార్‌కు చెందిన నా తండ్రి మాధవ్‌ప్రసాద్ సింగ్ గాంధేయవాది, ఉపాధ్యాయుడు. ఆయన చేస్తున్న కొన్ని సామాజిక కార్యక్రమాలు జీర్ణించుకోలేక ఓ సాధారణ మృతి కేసును హత్య కేసుగా మార్చి అరెస్టు చేశారు. దీనికి ఓ పోలీసు, వైద్యుడు సహకరించారు. అప్పుడు నాకు 13 ఏళ్లు. నా తండ్రిలా మరో నిస్సహాయుడు బలికాకుండా చూసేందుకు పోలీసు అవ్వాలనుకున్నాను. కష్టపడి సాధించా.  25 ఏళ్లకు పైబడిన ఉద్యోగ జీవితంలో పోలీసు అనేది ఓ నిరర్థకమైన వ్యవస్థ అని అర్థమైంది. అన్ని కోణాల్లో, స్థాయిల్లోనూ మార్పు కోసం ప్రయత్నించి విఫలమయ్యాను. ఈ పోలీసు, న్యాయ వ్యవస్థలతో 98 శాతం ఉన్న సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదని తేలిపోయింది.
 
 పోలీసులు తలచుకుంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అనిశ్చితిని 6 నెలల్లో కొలిక్కితేగలరు. అలా చేయించడం నాయకులకే ఇష్టం లేదు.  విశాఖపట్నంలో డీ ఐజీగా పని చేస్తుండగా ఓ ఎంపీ వచ్చి ఆయన కులానికే చెందిన ఓ వ్యక్తికి పోస్టింగ్ అడిగాడు. నియామకానికి ప్రాతిపదిక పనితీరేనని, కులం కాదని చెప్పా. ముఖ్యమంత్రి, డీజీపీ నుంచి కింది స్థాయి వరకు అన్నీ కులం ప్రాతిపదికనే జరుగుతుంటే నువ్వెందుకు అలా చెయ్యవంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యవస్థలో ఆ దేవుడే పోలీసుగా వచ్చినా ఒరిగేదేం ఉండదు.  సివిల్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఎవరైనా కోర్టుకు వెళితే 20 ఏళ్లు పోరాడాలి. అందుకే ఇలాంటివి సెటిల్ చేసుకోవడానికి స్థానిక రౌడీల్ని ఆశ్రయిస్తుంటారు.  ప్రస్తుతం జైళ్లలో ఉన్న వారిలో 90 శాతం నిరుపేదలే. డబ్బున్న వారు తేలిగ్గానే బయటకు వచ్చేస్తారు. చివరకు న్యాయవ్యవస్థ కూడా ఇలా ఉంటే ఎలా?  మంత్రి ఇంట్లో బాంబు పేలిన కేసే కాదు.. గతంలో స్పేర్ పార్ట్స్ అధిక ధరలకు విక్రయిస్తున్న సంస్థపై నేనే స్వయంగా కేసు నమోదు చేశా.
 
 దర్యాప్తు చేపట్టిన సీఐడీ నా వాంగ్మూలం నమోదు చేయకుండానే కేసు మూసేసింది. అప్పట్లో సీఐడీ డీజీగా పని చేసిన వ్యక్తి ఆ తర్వాత డీజీపీ అయ్యారు. ఇలాంటి పనికిమాలిన వ్యవస్థ కోసం అనేక మంది పోలీసులు కుటుంబాల్ని, ప్రాణాల్ని త్యాగం చేస్తున్నారు.  సోహ్రాబుద్దీన్ ఓ క్రిమినల్ అని అందరికీ తెలుసు. అయినా ఓ ప్రముఖ నాయకుడిని అందులో ఇరికించడం కోసం ఆ కేసుకు ప్రాధాన్యం ఇచ్చి సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నారు.  ఏదైనా ఘటనకు సంబంధించిన సీన్‌లో లేని వారికి గ్యాలెంటరీ మెడల్స్ వచ్చేస్తున్నాయి.  ఇప్పటివరకు ప్రముఖ పోలీసు అధికారులుగా పేరు సంపాదించిన వారంతా కేవలం ఆ పేరు కోసమే పని చేశారు తప్ప వ్యవస్థను మార్చడం కోసం కాదు. లాబీయింగ్ ఉన్న వారికే అన్ని ఉన్నత పదవులూ దక్కుతున్నాయి.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement