‘ఎక్కడివారు అక్కడే ఉండాలి’ | CM YS Jagan Hold Review Meeting On Coronavirus | Sakshi
Sakshi News home page

‘సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు’

May 3 2020 3:15 PM | Updated on May 3 2020 3:53 PM

CM YS Jagan Hold Review Meeting On Coronavirus - Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రయాణాల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని కోరింది. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఏపీ ప్రజల పరిస్థితిపై చర్చించారు.(చదవండి : కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్‌ కేసులు)

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో  పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని , అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని పేర్కొంది. కోవిడ్‌-19పై  చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ఇలాగే ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement