మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు

Chandrababu Naidu Fake Promotions On Anna Canteen - Sakshi

సాక్షి, అమరావతి : దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. బాబు చేసేది గోరంత చెప్పుకొనేది కొండంత. ఇందులో ఆయనకు ఉన్న అనుభవం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం పేరు చెప్పుకొని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇటీవల ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్‌ చేసుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. 

తాజాగా ప్రచార బాబు సోషల్‌ మీడియా వేదికగా మరోసారి దొరికిపోయారు. విషయం ఏంటంటే అన్న క్యాంటీన్‌ పేరుతో ఇటీవల చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ప్రారంభించిన రెండో రోజునే ఆహారం లేదంటూ కొన్ని చోట్ల క్యాంటీన్లను మూసివేశారు. మరికొన్ని చోట్ల ఆకలి తీర్చుకుందామని వచ్చిన పేదలపై తెలుగుదేశం నాయకులు జులుం చూపించారు. పట్టెడు మెతుకుల కోసం వచ్చిన వారిపై నిర్థాక్ష్యణ్యంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి.

అయితే చేసిన గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకొనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రమోట్‌ చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన అసలు ఘనత బయటపడింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రూపాలయకే నాణ్యమైన భోజనం పేదలకు అందించాలనే లక్ష్యంతో ఆళ్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ సందర్భంగా రాజన్న క్యాంటీన్‌ దగ్గర కడుపు నింపుకుంటున్న కొన్ని ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ చిత్రంలో కొంత మంది పేదలు భోజనం చేస్తున్న ఫొటోలను కూడా పొందు పరిచారు. కానీ వాటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ఫొటోలను ఉపయోగించుకున్నారు. దీన్ని గ్రహించిన సోషల్‌ మీడియా కార్యకర్తలు చంద్రబాబు పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రచారం తప్ప పనిలేదని మండిపడుతున్నారు.

చంద్రబాబు ప్రచార చిత్రాలను పరిశీలించండి

పై చిత్రం 11-07-2018 రోజున ప్రచార మధ్యమాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. ఇందులో బ్లూకలర్‌లో ఉన్న వృత్తాన్ని పరిశీలించండి. ముగ్గురు వ్యక్తలు  భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కింద ఉన్న మరో చిత్రాన్ని పరీక్షించండి.
ఈ ఫొటో 14-05-2017 రోజున మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజున ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌. ఈ ఫొటోనే చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రచార చిత్రంగా వాడుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top