
ఎర్ర చందనం దుంగలు పట్టివేత
కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవరపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిలో రూ.1.5 లక్షల విలువ చేసే 14 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
జాతీయ రహదారిలో అటవీ సిబ్బందికి కారుతో సహా పట్టుబడిన దొంగ
కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవరపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిలో రూ.1.5 లక్షల విలువ చేసే 14 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం జాతీయ రహదారిపై మరూరు టోల్ గేట్ సమీపంలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది పద్మావతి, అయూబ్బాషా, జరీఫాలు.. అనంతపురం నుంచి బెంగుళూరు వైపు అనుమానాస్పందంగా వెళ్తున్న క్వాలీస్ కారును గుర్తించారు.
వెంటనే వారు దానిని వెంబడించారు. పర్వతదేవరపల్లి సమీపంలో కారు ఆపి అందులోని ఉన్న వారు దిగి పరుగు తీశారు. కాగా గ్రామస్తులు కూడా అటవీ సిబ్బందికి సహకరించడంతో మణి అనే ఒక దొంగ పట్టుబడ్డాడు. అనంతరం కారును పరిశీలించగా అందులో 14 ఎర్ర చందనం దుంగలు ఉండటాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లా తిరుపతి సరిహద్దు ప్రాంతం నుంచి వీటిని తీసుకు వస్తున్నట్లు తెలిసిందని, పట్టుబడిన దొంగ, పారిపోయిన మహిళా దొంగ తిరుపతికి చెందిన వారని డీఎఫ్ఓ తెలిపారు. దుంగల్ని అనంతపురంలోని జిల్లా అటవీ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.