ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలి | Brijesh Kumar Tribunal Judgment to be To be canceled | Sakshi
Sakshi News home page

ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలి

Feb 12 2014 2:56 AM | Updated on Sep 2 2017 3:35 AM

కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతులు, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో

ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ :  కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతులు, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ట్రిబ్యునల్ ముందు కృష్ణా డెల్టా ప్రయోజనాలు కాపాడేలా వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. నీటిలభ్యత, మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీసుకున్న ప్రాతిపదకలు శాస్త్రీయంగా లేవని, ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రతిపాదించ కూడదని డిమాండ్ చేశారు. 
 
 ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్‌కు అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కౌలురైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీవ్ర హాని చేసే విధంగా ఉందన్నారు. కాలువ పనుల ఆధునికీకరణను సకాలంలో పూర్తి చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వాస్తవ సాగుదారులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు రైతు సంఘం నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్, సత్తిబాబు, కౌలు రైతుల సంఘ నాయకులు గండి రాజా తదితరులు నాయకత్వం వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement