ప్రొటోకాల్‌ ప్రముఖులకే బ్రేక్‌ దర్శనం

సాక్షి, తిరుమల : సంవత్సరాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. కాబట్టి గోకులం భవనంలోని జేఈవో కార్యాలయంలో శుక్రవారం నుంచి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని, ఈ నిర్ణయాన్ని జనవరి మొదటి వారంలో మళ్లీ సమీక్షిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆర్జిత సేవలను, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవని అధికారులు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో ఏకాంతంగా అభిషేకం నిర్వహించిన తరువాత ప్రముఖులకు బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. లఘు దర్శనం మాత్రమే అమలుచేస్తారు. హారతి ఉండదు. మహద్వార ప్రవేశం ఉండదు. టికెట్లపై సూచించిన మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top