బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి గుండెపోటు | Sakshi
Sakshi News home page

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి గుండెపోటు

Published Tue, Jan 6 2015 2:00 AM

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి గుండెపోటు - Sakshi

  • తిరుమల కాలిబాటలో ఘటన  
  •  మెరుగైన వైద్యంతో కోలుకుంటున్న మురళీధర్‌రావు
  • తిరుపతి: శ్రీవారి దర్శనార్థం కాలిబాటలో తిరుమలకు వెళుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావుకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కార్యకర్తలు తక్షణమే స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం మురళీధరరావు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకున్నారు. సాయంత్రం వరకు వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    అనంతరం శ్రీవారి దర్శనం కోసం రాత్రి 10 గంటకు అలిపిరి నుంచి కాలిబాటలో బయలుదేరారు. 11.30 గంటల ప్రాంతంలో గాలిగోపురం వద్దకు చేరుకోవడానికి మరో 500 మెట్లు ఉండగా పడిపోయారు. పార్టీ నాయకులు తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ గాలిగోపురం వద్దకు మాత్రమే రాగలిగింది.

    దీంతో కొందరు నాయకులు మురళీధర్‌రావును చేతులపై ఎత్తుకుని గాలిగోపురం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. అనంతరం అతడ్ని మెరుగైన చికిత్స కోసం అపోలోకు, తర్వాత స్విమ్స్‌కు తరలించారు.
     

Advertisement
Advertisement