100 రోజుల చరిత్ర

AP CM YS Jagan Mohan Reddy has completed hundered days administration - Sakshi

విన్నారు.. చూశారు.. చేస్తున్నారు..విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం

జనరంజక పాలనకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌

100 రోజుల పాలనలో 100కు పైగా నిర్ణయాలు

మళ్లీ సువర్ణయుగం దిశగా సర్కారు అడుగులు

సామాజిక విప్లవానికి సరికొత్త మార్పులు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం

నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు

రివర్స్‌ టెండరింగ్‌తో అవినీతిపై ఉక్కుపాదం

లక్షలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం

సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయు వేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర.

ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌.. జూన్‌ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్‌ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు. సీఎం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇలా..

పింఛన్ల పెంపుపై తొలి సంతకం
► అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం.
► పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం.
► కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్‌. తలసీమియా, పక్షవాతం, మస్కులర్‌ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన.

మహిళలకు చేయూత
► డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం.
► ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు.
► అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం.
► పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్‌ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు


రైతాంగానికి అన్ని విధాలా భరోసా

► ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్‌ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌లో మాత్రమే  ఇస్తారు.
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా.
► ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు.  
► గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు.
► ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం.
► ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు.
►  భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు.  
► జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక.
► సీఎం చైర్మన్‌గా వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు.
► రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్‌ ఉచిత బీమా పథకం.
► 2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడీ విడుదల.
► ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల.
► కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల.
► ఆయిల్‌ పామ్‌ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల.
► నాఫెడ్‌ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు.
► తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు.
► గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు.
► వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ.
► పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం.
► కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్‌ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్‌ సెస్‌ రద్దు. ఫలితంగా క్వింటాల్‌ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం.  

జీతాల పెంపు
► పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు.
► అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు.
► డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయం.
► గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు
► హోంగార్డుల వేతనాలు పెంచుతూ  నిర్ణయం.

ఉద్యోగాలు.. ఉపాధి.. విద్య
► గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు.
► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం.
► కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్‌లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం.
► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు.
► జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
► ఇంటర్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు.
► రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు.
► సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం.
► దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు
► ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం.
► పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్‌ డే

 
ప్రజా సొమ్ము ఆదా
► వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం.
► గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగ్‌
► రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం.

కీలక బిల్లులు.. చట్టాల సవరణ
► 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం.
► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే.
► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ చట్టం సవరణ బిల్లు ఆమోదం.
► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు.
► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు.
► ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం.
► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.
► ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం.
► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం.
► గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం.

అందరికీ వైద్యం.. అదే ధ్యేయం
► ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలు. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తింపు. 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తింపు.
► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు.
► రెండేళ్లలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు.
► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు)
► డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు.
► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం.
► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్‌ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు.
► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు

 
పారదర్శక పాలన
► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం.
► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష..  
► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ
► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు చర్యలు.
► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌. సీపీఎస్‌ రద్దుకు నిర్ణయం.
► అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు
► వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన.
► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని,  పారదర్శకమైన ఇండస్ట్రీయల్‌ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు.
► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం.
► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు
► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు.
► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు.

 
ప్రజాభ్యుదయమే లక్ష్యం

► ఉద్దానం కిడ్నీ వ్యాధుల కోసం రూ.600 కోట్లతో మంచినీటి పథకం.
► విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్‌ తవ్వకాలకు నో.
► రేషన్‌ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ.
► దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌.
► షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం.
► ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంపు
► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం. డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీ లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంపు.
► సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్‌ అవసరాల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం
► మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం.
► వైఎస్సార్‌ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు.
► ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం.
► క్రీడాకారులకు ప్రోత్సాహకాలు.
► ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ పథకాలు.
► ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్లే హజ్, జెరూసలెం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాల పెంపు.
► ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top