​​​ఏపీ బంద్‌ సక్సెస్‌!

Andhrapradesh shutdown for demand of APSpecial status - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. బంద్‌కు అడుగడుగునా తీవ్ర నిర్బంధాలు, నిషేధాజ్ఞలు విధించినా.. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను అరెస్టులు చేసి.. గృహనిర్బంధాలు విధించి.. బంద్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుటిలయత్రాలు చేసినా.. వాటన్నింటినీ ఛేదించి.. విజయవంతంగా పార్టీ నేతలు బంద్‌ నిర్వహించారు. ప్రజలు, పలు ప్రజాసంఘాలు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని.. విజయవంతానికి కృషిచేశారు. ప్రత్యేక హోదాపై తమ ఆకాంక్షను మరోసారి బలంగా చాటారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను అరెస్ట్‌ చేయించింది. ఈ క్రమంలో హోదా కావాలంటూ  తూర్పు గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బంద్‌లో పాల్గొన్న పార్టీ కార్యకర్త దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఆయన మృతిచెందారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంద్‌కు సంబంధించిన విశేషాలు..!

దుర్గారావు మృతికి బాబే కారణం : వైఎస్‌ జగన్‌
ఏపీ బంద్‌ విజయవంతంగా జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ఆకాంక్ష అని, ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా అతి దారుణంగా ఏపీ బంద్‌ను చంద్రబాబు సర్కారు అణచివేయాలని చూసిందని ఆయన మండిపడ్డారు. ఏపీ బంద్‌ సక్సెస్‌ నేపథ్యంలో ఆయన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. బంద్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో చనిపోయారని, ఆయన మరణానికి చంద్రబాబే కారణమని వైఎస్‌ జగన్‌ అన్నారు.  ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

వందల సంఖ్యల్లో కార్యకర్తల అరెస్ట్‌
ప్రత్యేక హోదా ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేసింది. ప్రతి జిల్లాలోనూ వందల సంఖ్యలో కార్యకర్తలు అరెస్ట్‌ చేశారు. పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు. ఉదయం నుంచి కార్తకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళా కార్యకర్తలను కూడా విచక్షణారహితంగా లాక్కెళ్లి అరెస్ట్‌ చేశారు.
 
ఖండించిన జనసేన
ఏపీ బంద్ నేపథ్యం వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులను జనసేన పార్టీ ఖండించింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.

బంద్‌లో విషాదం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
తూర్పుగోదావరి జిల్లా: హోదా కోసం శాంతియుతంగా నిర్వహిస్తోన్న రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. హోదా కావాలని నిరసిస్తూ బుట్టాయిగూడెంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బంద్‌లో పాల్గొన్న పార్టీ కార్యకర్త దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే దుర్గారావు మృతిచెందారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
హోదా కోసం తలపెట్టిన ఏపీ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిపట్ల వైఎస్‌ జగన్‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి జననేత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా పోరులో దుర్గారావు అమరుడయ్యారని పేర్కొన్నారు.

దుర్గారావు మృతికి ప్రభుత్వమే కారణం :  బొత్స
ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి పట్ల ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోదా కోసం నిర్వహించిన బంద్‌ను టీడీపీ అణగతొక్కే యత్నం చేసిందని మండిపడ్డారు. హోదా కోసం పోరాటం చేస్తుంటే ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆరోపించారు. దుర్గారావు చనిపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని బొత్స పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీల టైంపాస్‌
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తాము రాష్ట్ర వ్యాప్త బంద్‌ చేస్తుంటే, ప్రధానమంత్రిని నిలదీయకుండా టీడీపీ ఎంపీలు టైంపాస్‌ చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేత కొలుసు పార్ధసారథి విమర్శించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 5 కోట్ల ఆంధ్రులకు హోదా దొంగ ఎవరో తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు హోదా దొంగ అని వ్యాఖ్యానించారు. బంద్‌ను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని, హోదా నినాదం గొంతు నొక్కేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అరెస్ట్‌
బంద్‌లో పాల్గొనేందుకు వెళుతున్న పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా బేతంచర్లలో బుగ్గన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు హల్‌ చల్‌ చేశారు. బంద్‌లో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటకు రాగానే బుగ్గనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా :
నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెలేలు రోజా, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందన్నారు.

కుప్పం  వైఎస్సార్‌సీపీ ఇంచార్జి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వెంకటేశ్‌ గౌడ్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తుమ్మలగుంటలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి యంఆర్ పల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఏపీ బంద్‌: అంబటిపై అమానుషం
బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తా తిప్పుతున్నారు. మొదట సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల తీసుకెళ్లారు. తర్వాత రాజుపాలెం పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నరసరావు పేట నుంచి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

గుంటూరు జిల్లా :
జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాలుగు గంటల నుంచే  బస్టాండు ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగారు. వినుకొండ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఏపీ బంద్ నిర్వహిస్తున్నారు. తెనాలిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, ఎల్.అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు, కిలారు రోశయ్యల, రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపి నేత కాసు మహేష్ రెడ్డి అరెస్ట్ చేశారు. తాడికొండలో బంద్ నిర్వహిస్తున్న వైసీపి నేతలు క్రిస్టియానాతో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

రేపల్లెలో ఉద్రిక్తత :
వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో.. గోబ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. బంద్ లో పాల్గొన్న కార్యకర్తలను పెదకాకాని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో వారిని వదిలేయాలంటూ రావి వెంకటరమణ హైవేపై బైఠాయించారు. ఆయన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ప్రకాశం జిల్లా :
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ చీమకుర్తిలో బంద్‌కు మద్దత్తుగా ప్రవేటు విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు ప్రకటించాయి. యర్రగొండపాలెం నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఐవి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కంభం మండలంలో కూడా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అనంతపురం జిల్లా :
ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ, బీజేపీ మోసాలను నిరసిస్తూ పెనుకొండ సమన్వయ కర్త శంకర్ నారాయణ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాగేపరశురాంలను హౌస్ అరెస్ట్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా : 
నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నరసాపురంలో  ధర్నా నిర్వహించారు. ఉదయం ఐదు గంటల నుండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బస్టాండ్ వద్ద బైఠాయించారు. భారీగా పోలీసులు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. కొవ్వూరు బస్టాండ్ వద్ద నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో బస్సును కార్యకర్తలు అడ్డుకున్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఎలీజా ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయి బాలపద్మా, బాబ్జి, బి.వి.ఆర్. చౌదరి, ఆది విష్ణు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా :
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు వంద మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్ కోట, గజపతినగరంలో వైఎస్సార్‌సీపీ బంద్ నేపథ్యంలో బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి.

నెల్లూరు జిల్లా : 
కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వెంకటగిరి, తిరుపతి రహదారిని కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. ఆత్మకూరులో బంద్ చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు కొండ వెంకటేశ్వర్లు, నోటి వినయ్ కుమార్, ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లా: దక్షిణ నియోజక వర్గం కన్వీనర్ కోలా గురువులు, జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ద్వారకా బస్ స్టాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌కు మద్దతుగా మద్దిలపాలెం జంక్షన్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్సీపీ సమన్వయ కర్తలు తైనాల విజయ్ కుమార్, వంశీ కృష్ణ, కె.కె.రాజు, వైఎస్సార్సీపీ నాయకులు చొక్కాకుల వేంకటరరావు, రామన్న పాత్రుడు, బొని శివరామ కృష్ణ, శ్రీదేవిలు ర్యాలీ లో పాల్గొన్నారు. మద్దిలపాలెం జుంక్షన్‌లో వైఎస్సార్సీపీ నాయకులు రాయుడు శ్రీను, రవి, వరలక్ష్మి, కృపాతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా :
అమలాపురం బస్టాండు వద్ద పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ డిపో ఎదుట కార్యకర్తలు, నాయకులు బైఠాయించడంతో బస్సులు నిలిచిపోయాయి. రాజోలులో కోఆర్డినేటర్  బొంతురాజేశ్వర్రావుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు  చేశారు.

వైఎస్సార్ జిల్లా :
పులివెందుల బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ చేపడుతున్న వైఎస్ మనోహర్ రెడ్డిని పోలీసుల అరెస్ట్ చేశారు. రాయచోటిలో బంద్ పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి,వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగరంలోని సంధ్య కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లాతో పాటు మరికొంత మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీకాకుళం:
పలాస ఆర్టీసీ డిపో ముందు పలాస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ధర్నాలో పాల్గొన్నారు. టెక్కలి ఆర్టీసీ డిపో ముందు టెక్కలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ధర్నాకు దిగారు.

విజయవాడ: 
ప్రత్యేక హోదా కోసం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. బంద్‌లోభాగంగా ఆర్టీసి అవుట్ గేట్ వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో బస్ స్డేషన్ వద్ద పోలీస్ భారీగా మోహరించారు. విద్యాధరపురం ఆర్టీసి డిపోవద్ద మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రానివ్వకుండా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. గాంధీనగర్‌లో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కర్నూలు జిల్లా: 
పత్తికొండ ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా వైఎస్సార్‌సీపీ ఇంచార్జి చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ నేతలు శ్రీరంగడు, బజారప్ప యూత్ యూత్ నాయకులు మధు, ఇమ్రాన్, పార్టీ కార్యకర్తలు డిపో ఎదుట బైఠాయించారు. డోన్‌లో తెల్లవారుజామున 4 గంటలకే బంద్ ప్రభావం మొదలైంది. జెడ్పీటీసీ శ్రీరాములు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నియోజకవర్గ ఇంచార్జి హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బివై రామయ్యా, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రాజా విష్ణు వర్దన్ రెడ్డి, రెహమాన్, రేణుకమ్మలు బంద్‌లో పాల్గొన్నారు. ఆదోనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ ఇంఛార్జి గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్రెడ్డి అధర్వంలో  బంద్ నిర్వహించారు. దీంతో ఎస్కార్ట్ సహాయంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడిపిస్తోంది. నందికొట్కూరులో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే ఐజయ్య, సిద్దార్థ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల జులుమ్ నశించాలని ఐజయ్య, సిద్దార్థ రెడ్డిలు రోడ్డుపై బైఠాయించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, గౌరు వెంకటరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

కర్నూలు తాలూకా పీఎస్ వద్ద ఉద్రిక్తత :
వైఎస్సార్సీపీ నాయకులు బివై రామయ్య అరెస్ట్‌కు నిరసనగా పీఎస్ ముందు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నూలు చెన్పమ్మ సర్కిల్‌లో కాటసా రాంభూపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. శివప్రసాదరెడ్డి , శ్రీదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నరసింహులను పోలీసులు అరెస్ట్ చేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు :

బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

నేడు రాష్ట్ర బంద్‌

హోదాకోసం వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటాలు

ప్రత్యేక హోదా - వైఎస్‌ జగన్‌ యువభేరిలు

ఏపీ ప్రత్యేక హోదా కథనాలు

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top