ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతరకు తెర లేపబోతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతరకు తెర లేపబోతున్నారు. మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రూ.273 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజల్లో రాష్ట్ర విభజన సెగలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఈసారి ఎన్నికల్లో తనకు కూడా ఇబ్బంది కలగొచ్చని రామనారాయణరెడ్డి భావిస్తున్నారు.
అయితే తాను కాంగ్రెస్లో ఉండటమే కాకుండా అనివార్యంగా జిల్లాలో ఆ పార్టీ బాధ్యతలు కూడా తలకెత్తుకోవాల్సి వచ్చింది. దీంతో సీఎం రాజీనామాకు ముందు తన నియోజకవర్గం ఆత్మకూరుకు వందల కోట్ల రూపాయల వ్యయమయ్యే పనులు మంజూరు చేయించుకున్నారు. నియోజకవర్గంలో ఈ పనులు ప్రారంభించడం వల్ల అభివృద్ధి నినాదంతో జనాన్ని ఓటు అడగవచ్చనే ఎత్తుగడ వేశారు.
దీనికి తోడు ఈ పనులను తమ మద్దతుదారులు, ఓటర్లకు ప్రభావితం చేయగలిగే వారికి కట్టబెట్టడం ద్వారా ఎన్నికల లబ్ధిపొందాలనే వ్యూహరచన ఇందులో జోడించారు. రాజధాని నుంచే జిల్లా అధికారులకు ఈ నెల 3వ తేదీ తన నియోజకవర్గంలో ఎన్నికల శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు ఒక్కటి కూడా వదలకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మంత్రిగా ఇప్పుడు ఆయన వేస్తున్న శిలాఫలకాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి అవుతాయా? లేదా? శంకుస్థాపనలు చూసి జనం ఓట్లు వేస్తారా? అనే సంగతి వేచిచూడాల్సి వుంది.