ఏసీబీకి చిక్కిన ఏఈ | acb officials were caught in the nagireddipeta pancayatiraj AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఏఈ

Aug 22 2013 3:59 AM | Updated on Aug 17 2018 12:56 PM

నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ :నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చీనూర్ పంచాయితీ పరిధిలోని మేజర్‌వాడి ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో మూడుమాసాల క్రితం  రూ. 75వేలతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు శ్రీనివాస్ మూడునెలలుగా కాంట్రాక్టరైన టీఆర్‌ఎస్‌పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గంపల యాదగిరిని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరికి ఎంబీ రికార్డు చేసేం దుకు రూ. 15 వేలు డిమాండ్ చేశారు. అంతపెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని యాదగిరి పేర్కొనగా చివరికి రూ. 10 వేలకు బేరం కుదిరింది. అనంతరం యాదగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
 
 పథకం ప్రకారం బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మం డల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో యాదగిరి నుంచి రూ. 10వేలు తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాస్‌ను అక్కడ మాటువేసిఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని  హైద్రాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీయస్సీ సంజీవరావు తెలిపారు. ఇన్‌చార్జి ఏఈగా శ్రీనివాస్ రెండున్నరేళ్లుగా మం డలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనఎల్లారెడ్డి పీఆర్ ఏఈగా రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు.
 
 ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు తమను సంప్రదించాలని డీయస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ  కోరారు. సెల్ నం. 9440446155 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఖుర్షిద్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులు మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి ఇలా దొరికిపోవడం ఈ ప్రాంతంలో మొదటి సారిగా స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకుని పలుగ్రామాల నుంచి నాయకులు, ప్రజలు మండల పరిషత్ కాార్యాలయానికి తరలివచ్చారు. అవినీతి అధికారుల్లో మాత్రం గుండె దడ మొదలైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement