మునిసిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17 నుంచి జరిగే సమ్మెను
17 నుంచి మునిసిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
Oct 14 2013 4:31 AM | Updated on Oct 16 2018 6:27 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: మునిసిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17 నుంచి జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే సామ్రాజ్యం పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. మునిసిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినప్పటికీ స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జీపీఎఫ్ అకౌంట్లు ప్రారంభించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి వర్తింప చేయాలన్నారు. అన్ని కేటగిరీల్లోని కార్మికులకు వారాంతపు, పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సన్నాహంగా మునిసిపల్ కమిషనర్లకు అర్జీలు ఇవ్వాలని కోరారు. మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకుడు పెదతిరుమలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు కొర్నెపాటి శ్రీనివాసరావు, పోకల కోటేశ్వరరావు, సింగయ్య, శంకర్, నారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement