15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ | Sakshi
Sakshi News home page

15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Published Thu, Jan 9 2014 12:40 PM

15 of YSRCP MLAs suspended from assembly for a day

సమైక్యాంధ్ర గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు.. అంటే గురువారం నాడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభా నిర్వహణకు అడ్డుపడుతున్నారన్న కారణంతో వీరిని సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరిపేందుకు స్పీకర్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు వినిపించారు. దీంతో శాసన సభ వ్యవహారాల మంత్రి సాకే శైలజానాథ్ మొత్తం 15 మంది సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించి, అందరినీ సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు.

అయితే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా తాము కూడా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. కాగా సభ నుంచి తమను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మార్షల్స్ నుంచి విడిపించుకుని మళ్లీ సభలోకి ప్రయత్నించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దాంతో వారిని మార్షల్స్ సభ నుంచి ఈడ్చుకొచ్చారు. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేలు బైఠాయించి, సమైక్య నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

సస్పెండైన ఎమ్మెల్యేలు వీరే..
అమర్ నాథరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుర్నాథరెడ్డి, భూమన, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, మేకతోటి సుచరిత, వెంకట్రామిరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement