నాకు ఓటేయకపోతే ప్రజలే సిగ్గుపడాలి: సీఎం
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాము చేసిన పనులకు ప్రజలు ఆటోమేటిక్గా అన్ని సీట్లు గెలిపించాలన్నారు. ఒకవేళ ఒకటి, రెండు సీట్లు గెలిపించకపోతే ఎందుకు గెలిపించలేదో వాళ్లే ఆలోచించుకోవాలన్నారు. తాము తప్పుచేశామని ప్రజలు సిగ్గుపడే పరిస్థితి రావాలన్నారు.
ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అన్నీ చేసిన తర్వాత తనకు ఎందుకు ఓటేయరని, ఇంకా ఏం కావాలని ప్రజలను ప్రశ్నించారు. ఇదంతా తన కష్టమని, తన కష్టానికి కూలి ఇవ్వాలన్నారు. వంశధార దగ్గర నుంచి సోమశిల వరకూ నదుల అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.