ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు | Fact Checking Vijays Governance Claims Reality | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు..

May 20 2026 7:49 PM | Updated on May 20 2026 8:14 PM

Fact Checking Vijays Governance Claims Reality

అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. 

అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..

టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్‌ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు  వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్‌తో మొదలు పెడదాం. 

అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? 
ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. 

ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్‌లను చూపించి ప్రచారం చేశారు. 

విశ్వసనీయతను దెబ్బతీసేలా.. 
విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.

ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే 
ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా?  
ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా  ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్‌ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.

ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.

నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్‌కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement