క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే? | How Russias S 400 Travels Thousands of Miles to Guard Indian Borders | Sakshi
Sakshi News home page

క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?

May 20 2026 10:06 PM | Updated on May 20 2026 10:06 PM

How Russias S 400 Travels Thousands of Miles to Guard Indian Borders

భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్‌కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

చరిత్రాత్మక ఒప్పందం  
భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.

ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్‌పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.

రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్‌కు వస్తున్న నాలుగో యూనిట్‌కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.

సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్‌లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్‌మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.

భారత్‌కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్‌లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.

ఐదో యూనిట్‌ను చైనా సరిహద్దులో 
ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.

ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement