art teachers
-
నీటి విలువ నేర్పుదాం!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..→ ‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాకపోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. → పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.→ పంచ భూతాలలో నీరు ప్రాణాధారమైనదనే విషయం పెద్దలుగా మనకు తెలుసు. ఈ విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి..?! తల్లిదండ్రులు లేదా టీచర్లు పిల్లల వయసును బట్టి 5 విభాగాలుగా తీసుకోవాలి.→ నర్సరీ, ప్రీ ప్రైమరీ నుంచి 2 వ తరగతి వరకు, 3–5 తరగతులు, 6–7 తరగతుల వారీగా తీసుకొని, విజువల్ ఆర్ట్ ద్వారా చూపించమనాలి. ఇలా చెప్పి చూడండి... నీటిచుక్క పరిమాణం, నీళ్లు వివిధ పాత్రలలో పోస్తే వచ్చే మార్పు.. ను డ్రాయింగ్ ద్వారా చూపమనవచ్చు.నీటి మాట→ నీటి ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. పంటలు పండుతాయి. ఇలాగే ఇంకేం లభిస్తాయి? పిల్లలనే అడగండి. → నీటి వనరులు లేని చోట వాతావరణం ఉండే విధానం, పరిష్కారం కూడా సూచించమనాలి.→ నీటి శుభ్రత గురించి ఏమేం చేయవచ్చో వారినే ఆలోచించి, ప్రెజెంట్ చేయమనాలి.→ వాటర్ వర్డ్స్ .. నీటికి సంబంధించిన పదాలతో క్రాస్ పజిల్స్, డూడుల్స్, సాంగ్స్... కళాత్మకమైన సందేశాన్ని ఇవ్వమని చెప్పవచ్చు. → రోజువారీ జీవన విధానంలో నీటి ప్రాముఖ్యత గురించి పిల్లలను చెప్పమని ప్రోత్సహిస్తూ, వారిచేత వివిధ రకాల యాక్టివిటీస్ను చేయించవచ్చు. ఆరోగ్యకరమైన పోటీని కూడా పిల్లల మధ్య పెట్టవచ్చు. పిల్లలు నీటి గురించి చేసే ఎన్నో విన్యాసాలకు వాళ్లే కాదు, పెద్దలూ నవ్వుతారు. తమ గురించి స్వచ్ఛమైన మనసులు పడే తపనను చూసి నీటి చుక్కలు కూడా అందంగా నవ్వుతాయి.ఇలా చెబుదాం...→ దాహం వేసినప్పుడు ఏం తాగుతాం. → నీళ్లను ట్రేలో పోసి, ఫ్రిజ్లో పెడితే ఐస్క్యూబ్స్గా ఎలా అవుతాయి. బయటకు తీస్తే ఐస్ క్యూబ్ కరిగిపోయి తిరిగి నీళ్లుగా ఎలా మారుతాయి. → హిమాలయాలు ఎందుకు అంతగా చల్లగా ఉంటాయి, అవి కరగడం వల్లనే నీళ్లు మన దాకా వస్తున్నాయా?→ కూరగాయలు, పండ్లు ఎలా వస్తాయి? → నీళ్లతో స్నానం చేస్తే మైండ్, బాడీ కూల్ అండ్ ఫ్రెష్ ఎందుకు అవుతుంది.→ వేసవిలో చెరువు నీళ్లలోకి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కదా, అలా దిగినప్పుడు ఆ నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి. → చెరువులు, కుంటలు, నదులు, బ్యాక్ వాటర్, సముద్రం... భూమి మీద నీరు ఎక్కడెక్కడ ఉంటుంది, భూమిలోపలకు నీళ్లు ఎలా చేరుతాయి, మనం ఎన్ని విధాలుగా నీళ్లను వాడుకుంటున్నాం. చెట్లు నీళ్లు ఎలా తాగుతాయి.. ఇవన్నీ పిల్లలనే అడగాలి. ఇలా నీటికి సంబంధించిన ప్రతీ ఉపయోగం.. కథ, నాటకం, డ్రాయింగ్, ప్రయోగ రూపం... ఏదైనా పిల్లల నుంచే వచ్చినదై ఉండాలి.పొదుపు ఇలా...తాగు నీళ్ల కోసం కుళాయిల వద్ద, వేసవిలో ట్యాంకర్ల వద్ద జరిగే నీటి యుద్ధాల గురించి మనకు పరిచయమే. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పలేం. భవిష్యత్తులో నీటియుద్ధాలు రాకుండా ఉండాలంటే నీటి పొదుపు గురించి వారి ఆలోచనల ద్వారానే చెప్పించవచ్చు.→ షవర్తో కాకుండా బకెట్ నీళ్లతో స్నానం చేయమనాలి. పూర్తి బకెట్ నీళ్లు కాకుండా అందులో నుంచి మరికొన్ని తగ్గించి వాడమనాలి ∙బట్టలు ఉతికిన నీళ్లను తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్పమనాలి.→ నీళ్లు తిరిగి భూమిలోకి ఎలా ఇంకుతాయో చూపమనాలి. ఈ విధానం వల్ల నీటి పిల్లల్లో నీటి వృధాను తగ్గించవచ్చు అనే ఆలోచన వస్తుంది.నిర్వహణ: నిర్మలారెడ్డి -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్రూమ్లో కంటే ఆర్ట్ రూమ్లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్తో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్లో నా 12 పెయింటింగ్స్లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!
బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు. కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రసంసించే చిత్రాలు.. సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు. ఆర్టు అకాడమీలో ప్రశంసలు.. ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు. -
ఫలించిన వృత్తివిద్యాబోధకుల పోరాటం
హైకోర్టు ఆదేశాలతో విధుల్లోకి తీసుకున్న విద్యాశాఖ కరీంనగర్ ఎడ్యుకేషన్: సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ టీచర్ల పోరాటం ఫలించింది. గత నాలుగు నెలలుగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అనేక ఆందోళనలు చేపట్టి విజయం సాధించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారిని శుక్రవారం జిల్లా విద్యాశాఖ విధుల్లోకి తీసుకుంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాల్సి ఉండగా.. సర్వశిక్షాభియాన్ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 310 మంది పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు ప్రజాప్రతినిధులను, విద్యాశాఖ జిల్లా, రాష్ట్ర అధికారులను కలిసి అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి నియమాకానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నాలుగు రోజుల క్రితం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ విద్యాశాఖ అధికారులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీల నుంచి వారి వివరాలను సేకరించి తిరిగి విధుల్లోకి చేర్చుకుంటున్నారు. జిల్లాలో ఆర్ట్ ఎడ్యుకేషన్లో 93 మంది, పీఈటీలు 69 మంది, వర్క్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్లో 74మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 74 మంది విద్యార్హత ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తరువాత నియమాకాలు చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కాగా.. వృత్తివిద్యాబోధకులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి లక్ష్మీనారాయణతోపాటు ఆడెపు సంపత్, రఘు, కేశవ్, తిరుపతి, సత్యనారాయణ, ఆనంద్కుమార్, కిషన్, గోపాల్, నర్సయ్య, చంద్రకళ, గీతారాణి, మంజుల, అనురాధ, విజయలక్ష్మి, అనిత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


