రాజంపేట : పట్టణంలోని బైపాస్రోడ్డులో తిరుమల బార్ సమీపంలో గురువారం కియో కారు బీభత్స సృష్టించింది. రోడ్డు పక్కగా ఉన్న షాపుల బోర్డులను కొట్టుకుంటూ వెళ్లింది. అక్కడున్న వాహనాలను కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు.కియో కారు డ్రైవరు నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైన కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల విచారణలో వివరాలు వెల్లడి కావాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.
దాడిలో ఒకరికి ..
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులో నాగ రాజారెడ్డి అనే వ్యక్తిపై వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి దాడి చేసిన సంఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఎదురు ఎదురు ఇళ్లలో నివసిస్తున్న నాగ రాజారెడ్డి, వెంకట సుబ్బయ్య కుటుంబాల మధ్య చిన్నపాటి తగాదా జరిగింది. ఈక్రమంలో వెంకట సుబ్బయ్య నాగ రాజారెడ్డిపై కర్రతో డాడి చేయడంతో అతనికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు.
గూడ్స్ రైలు కిందపడి
వృద్ధురాలు మృతి
కడప కోటిరెడ్డిసర్కికల్ : కడప–కనుమలోపల్లె రైల్వేస్టేషన్ మధ్య గురువారం దిగువ రైలు పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు కడప జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతురాలికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. గూడ్స్ రైలు వెళుతన్న తరుణంలో అకస్మాత్తుగా అడ్డంగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు లోకో పైలెట్ తెలియజేశారన్నారు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో ఉంచామని, ఈమెనుగుర్తించిన వారు కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
గుర్తుతెలియని వ్యక్తి..
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. మృతుని ఆచూకీ ఎవరికై నా తెలిస్తే 9121100526, 9121100514 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.


