కడప అర్బన్: కడప జిల్లాలో రౌడీయిజం, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మైదుకూరు సబ్–డివిజన్ నేర సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఎస్పీ జారీ చేసిన కఠిన ఆదేశాలు:
రౌడీయిజంపై ఉక్కుపాదం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లపై జిల్లా బహిష్కరణ, పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవాలి. వారు నేరం చేయకముందే ముందస్తు నిఘాతో అడ్డుకోవాలి.
డ్రగ్స్, గంజాయిపై దాడులు:
రాత్రిపూట ముమ్మరంగా గస్తీ (పెట్రోలింగ్) నిర్వహించాలి. అనుమానిత వ్యక్తులను డ్రగ్ డిటెక్షన్ కిట్లతో తనిఖీ చేయాలి. గంజాయి రవాణా, బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచి దాడులు చేయాలి.
క్రైమ్ మ్యాపింగ్:
దొంగతనాలు జరిగే ప్రాంతాలను, నేరాల సరళిని మ్యాపింగ్ చేసి, ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలి. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి.
ఐపీఎల్ బెట్టింగ్, మట్కా అడ్డుకట్ట:
ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో గతంలో బెట్టింగ్ కేసుల్లో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మట్కా, గ్యాంబ్లింగ్, బెల్ట్ షాపులపై విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేయాలి.
సీసీ కెమెరాలు తప్పనిసరి:
ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం లాడ్జీలు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా అవగాహన కల్పించాలి.
మహిళా భద్రతకు ప్రాధాన్యత:
స్కూళ్లు, కాలేజీల వద్ద ‘శక్తి’ టీమ్ల బీట్లను ముమ్మరం చేయాలి. సోషల్ మీడియా వేధింపులపై బాలికలకు అవగాహన కల్పించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్ల ద్వారా ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.
రోడ్డు భద్రత – స్మార్ట్ పోలీసింగ్:
స్మార్ట్ పోలీస్ ఇండికేటర్లను మెరుగుపరచాలి. పెండింగ్ కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్లను త్వరగా అమలు చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, వాహనదారులు హెల్మెట్ ధరించేలా చూడాలి.
ఈ సమీక్షా సమావేశంలో మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్తో పాటు సబ్–డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కఠిన ఆదేశాలు


