● ముగ్గురు యువకుల అరెస్ట్
● 1.600 కిలోల గంజాయి స్వాధీనం
కడప అర్బన్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కేజీ 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు. కడప డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన కమలాపురం మాధవ, కడప నగరంలోని ప్రకాష్నగర్లో నివసిస్తున్న సాకే శంకర్ అలియాస్ శివ, ప్రకాష్ నగర్కు చెందిన ఉలవలపల్లి మనోజ్కుమార్ ఉన్నారని తెలిపారు. చిన్నచౌక్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు యు. ప్రతాప్ రెడ్డి, టి. హరిప్రసాద్ సిబ్బందితో కలిసి కడప పట్టణ పరిధిలోని తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులో నానాపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో నిఘా నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు కడప సిటీ యరమ్రుక్కపల్లికి చెందిన రాఘవ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకుని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ గంజాయి అక్రమ రవాణాలో లోతుగా విచారణ కొనసాగుతోందన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, స్వాధీనం చేసుకున్న గంజాయి


