సుండుపల్లె : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ బట్రాజుగారిపల్లెలో సోమవారం రాత్రి సమయంలో మాతమ్మ తల్లి తిరునాల జరిగింది. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఉదయం సమయంలో చాందినీబండి సెట్టింగ్ విప్పేందుకు కెవి పల్లి మండలం గన్నమిట్ట గ్రామానికి చెందిన పఠాన్ రెహమాన్ఖాన్(16).. బండి పైకి ఎక్కి విప్పుతుండగా ప్రమాదవశాత్తూ చాందినీబండి పైన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్లో నివాసముంటున్న షేక్ రకీబు (21) అనే మహిళ, తన ముగ్గురు పిల్లలు అబ్దుల్ అజీజ్(5), మైను(3), సైజు(1)లతో కలిసి ఇంటి నుంచి గత నెల 10వ తేదీ వెళ్లిపోయినట్లు ఆమె భర్త హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీంద్ర నగర్లో ఓ చికెన్ షాప్లో పని చేస్తున్న హుస్సేన్కు, అదే ప్రాంతానికి చెందిన రకీబుతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త వేధింపులను తట్టుకోలేక బాధితురాలు తన ముగ్గురు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా జాడ కనిపించకపోవడంతో భర్త హుస్సేన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాలూకా సీఐ నరసింహారాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.


