కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం బీసీలను వంచనకు గురి చేస్తున్న వైనాన్ని వివరిస్తూ త్వరలో బీసీ గళం సభను నిర్వహించబోతున్నామని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.శివరామ్ అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించి.. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు, బీసీ సబ్ ప్లాన్తో 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, అన్నీ సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్ ద్వారా బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్ ఇస్తామని హామీలిచ్చారన్నారు. బీల్లో కులానికో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పల్లెకు పల్లెకు వైఎస్సార్సీపీ బీసీ వాదం తీసుకెళ్లి ప్రభుత్వం మీద పోరాటానికి సమాయత్తం చేస్తామని అయన అన్నారు.
వైఎస్సార్సీపీ బీసీ విభాగం
జిల్లా అధ్యక్షుడు ఎన్.శివరామ్


