పెట్రో ధరల పెంపుపై నిరసనలు భగ్గుమన్నాయి.. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న బాబు మాటలు ఇప్పుడేమయ్యాయని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రశ్నించాయి. నాడు కోతలు కోసి.. నేడు నిలువునా వాతలు పెడుతున్న కూటమి తీరుపై దునుమాడాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు జనం స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ప్లకార్డులు చేతబట్టి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
కడప కార్పొరేషన్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, యువత, రైతులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ నడ్డివిరిచే చర్యలను తీవ్రంగా ఖండించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేశారు.
● జిల్లా కేంద్రమైన కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ శంకరయ్యకు వినతిపత్రమిచ్చారు. ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, పి. జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వాలపై ప్రజాగ్రహం
ఇంధన ధరల పెంపుపై
వైఎస్సార్సీపీ పోరు!
జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన
పార్టీ శ్రేణులు.
కలెక్టరేట్, తహసీల్దార్కార్యాలయాల ముట్టడి.
జిల్లా వ్యాప్తంగా దద్దరిల్లిన ధర్నాలు, నిరసన ర్యాలీలు


